Tuesday, September 13, 2011

'Mo' - Nishadam

Mo, or Vegunta Mohan Prasad departed from this world unexpectedly!

I was only waiting to meet him again and talk!
But, Alas, that is never to be!
Recently I wrote a review of his latest anthology of poems.
That was when he was still around!

I thought, like last time I wrote about him, we would again meet!

Anyway, Here is the review that appeared in Bhoomi daily!


‘మో’ నిషాదం (కవితా సంకలనం)


రచన: వేగుంట మోహన్ ప్రసాద్


ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర
పేజీలు: 186 - వెల: రూ. 100/-


ఈ విశ్వంలోని ఏ విషయమూ ఒక క్రమంలో లేదు. కనీసం సింపుల్‌గా లేదు. అంతా గజిబిజి. అందంగా చెప్పగలిగితే సంక్లిష్టత. అది అస్పష్టత మాత్రం కాదు. జీవానికి ఆధారమయిన డి.ఎన్.ఎ., ప్రొటీన్లలో నిజానికి ఒక క్రమం ఉంటుంది. డి.ఎన్.ఎ. తాటినిచ్చెన లాగుంటుంది. అప్పుడది పని చేయదు. మెలి తిరుగుతుంది. ముడుచుకుంటుంది. చిక్కులు పడేదాకా చేరుతుంది. ప్రొటీన్లూ అంతే! సంక్లిష్టం అయితే గానీ, వాటికి తగిన గుర్తింపు, ఉనికి లేదు. ఈ సంక్లిష్టతలో నుంచి మరింత సంక్లిష్టత పుడుతుంది. అణువులలాగే మాటలు కూడా రకరకాల కలయికల్లో వస్తాయి. ఈ ప్రపంచంలో ప్రతి విషయంలోనూ సంక్లిష్టత ఉంది. కానీ, మాటలలో మాత్రం అది ఉండకూడదంటారు. భాష ప్రయోజనం, భావాలను ఇచ్చి పుచ్చుకోవడం, భావాలు అర్థం కాకుంటే అపార్థాలు పుడతాయి. కానీ ఎందుకని సంక్లిష్టమయిన భావాలు అందవు? అలవాటు లేదుగనుకనా? సంక్లిష్టతే సహజంగదా? భాష కూడా అట్లా ఉంటేనే గజిబిజి భావాలను, ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలోచనలు సింపుల్‌గా రావు. మరిమాటలెందుకు సింపుల్‌గా రావాలి?


ఇక కవిత దాకా వస్తే అది బతుకును ప్రతిబింబించాలంటారు. బతుకు మరి సజావుగా ఉండదని తెలియదా? కవితలో సంక్లిష్టతే సహజం కదా? బతుకులో పదచిత్రాలు మాత్రమే ఉన్నాయా? ఎక్కడో ఒక కవి సహజంగా కవిత చెపితే అంతా అదిరిపోతారెందుకు? ఈ ‘నిషాదం’ రాసిన ‘మో’ నిజంగా బతుకు కవి. మిగతా వారంతా వేమనలు. పండు వలిచి చేతిలో పెడతారు.


నేనేదో సింపుల్‌గా చెపుతాను. అయినా అది ఎవరికీ అర్థం కాదు. అంటాడు మో. అందుకే తనతీరు కొంత మార్చుకున్నాడులాగుంది. సాంధ్య భాషలోని ‘మో’ ఈ నిషాదంలో కనబడుతున్నాడా? వెదకాలి! ‘రచన ఎవరయినా చదివేదాకా దానికొక అస్తిత్వమంటూ ఉండదు’ అంటాడు మో. తను ముందుమాటగా రాసిన ‘ఆధునిక కవితా నేపధ్యం (థ్యం?)లో! ఇదొక మాస్టర్ స్టేట్‌మెంట్. ఈ కవి, తన సంగతి తనకు తెలియక రాయలేదు. బతుకును ప్రతిబింబించాలని రాశాడు. తన రచన అందరినీ సంతృప్తి పరచలేదని చెపుతున్నాడు కూడా. కానీ, కాలం, బతుకు ‘మో’ను కూడా అందరి దారిలోకి లాగినట్లుందేమిటి? మోహన్ ప్రసాద్, రకరకాల కవితలను, పద్ధతులను స్టడీ చేసిన అకడమిషియన్. ఆ ప్రభావం కవితల్లో వద్దన్నా తొంగిచూస్తూ ఉండేది. అది కూడా కాస్త తగ్గుముఖం పట్టింది.


‘మో’ నిషాదానికి ‘సీతారాం’, ‘ఆరున్నొక్క రాగం’ పాడారు. ఆయన తన మార్గంలో మోని విశ్లేషించారు. ఇందులో కావలసినంత సంక్లిష్టత ఉంది! బావుంది! కాంప్లెక్సిటీ ఈజ్ వల్నరబుల్’ అంటాడు డేవిడ్ క్రిష్టియన్. సంక్లిష్ట కవిత్వాన్ని, అస్పష్ట కవిత్వంగా అపార్థం చేసుకొంటాడు అంటాడు ‘మో’! సామాజిక స్పృహ లేకుంటే కవిత అర్థం గాదు! అది స్వంత గోలవుతుంది. అందుకేనా? పారడాక్స్ లు, అయిరనీలు, పొలిటికల్ పోయెమ్‌లూ? ‘మో’ మనల్ని ముల్లుతాడనుకుని చదువుతుంటే.


అంతర్ మధన పర్యంకంపై తిరుగుతున్న పంకాని నొక్కిందెవరు? దానిమీట చెక్కిందెవరు? అంటాడేమిటి? ఇంతకంటే బాగా చెప్పడం కుదరడం లేదా? 2000 సంవత్సరం నుంచి మొదలు, నిషాదంలో కవితలను కాలక్రమం ప్రకారం చేశారు. అక్కడే మార్గం మారిందనాలి! 2001లో ‘ఉర్దూ-అక్షరాలు’ మరీ మామూలు కవితయిందేమిటి?
2001లో ‘గుసగుసలు పోతారు మీరు, పోతేపోయాడు గానీ ఈ సన్యాసిగాడు’ ఇందులో అస్పష్టతా లేదు సంక్లిష్టతా లేదు! 2008 వచ్చేసరికి ‘వేణువుద్వారా, వేయింతల వలపు, వనమంతా విశ్వగీతికాలాపన’, రేడియో పాటలాగ వినిపిస్తుందేమిటి? 2010లో ‘రెండు వెలుపలలోంచి లోపలి ఒక వెలుగు లోగిలి’! చివరాహరిన ‘వడ్లగింజలో నువ్వుల గింజ’!


ఏం చేసినా ‘మో’ అంటే ‘మో’ ఒకడే. బట్ విల్ ద రియల్ మో ప్లీజ్ కమ్ అవుట్?


Let us enjoy good books!
(*)(*)(*)(*)

No comments: