Sunday, November 21, 2010

Medha - 4

Here is the content from the Medha page of Andhra Bhoomi.
This is the fourth edition of Medha after I started contributing the content.

Here is the link to the current edition

http://www.andhrabhoomi.net/features/intelligent

Now the content from 8th November 2010 edition.

అరటి విత్తుల కోసం
హైదరాబాద్ ప్రాంతంలో అంతకుముందు దొరుకుతూ ఉంటే ‘ఛీటేవాలా’ అరటి పళ్లు, ఒకానొక వైరసు పుణ్యమా అని అదృశ్యమయి పోయినాయి. ఆ తర్వాత అందరూ మహారాష్ట్ర మీదబడి అక్కడి నుంచి ఒక ఆకుపచ్చ రకం అరటిని అరువు తెచ్చుకున్నారు. పదేళ్ల కాలంలో ఆ రకం కూడా అంతరించే చోటికి చేరుకుంది. అసలు ప్రపంచమంతటా అరటి పళ్లకు పోగాలము దాపురించింది అంటున్నారు.
మనకిప్పుడు ప్రపంచమంతటా అందుబాటులో ఉన్న అరటి రాకాలేవీ ప్రకృతి సిద్ధంగా దొరికినవి కావు అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్నాళ్లుగా, ఇనే్నళ్లుగా పట్టువదలని విక్రమార్కుని లాగా, బ్రీడర్లు నిరంతరం తమవంతు కృషి చేస్తూ ఉండబట్టి గానీ, అరటిపళ్లు అసలింతగా దొరికేవే కావేమో!
మనం ఆనందంగా తింటున్న ఈ అరటి పండు అది ఏ రకమయినా సరే ఒక సంకర జాతి. మూసా అకూమినేటా అన్న జాతిలో మంచి గుజ్జు ఉంటుంది. కానీ దీని రుచి, నోటబెట్టరాకుండా ఉంటుంది. మరో జాతి మూసా బల్బీసియానా. ఇది రుచిగా ఉంటుంది గానీ, నిండా గింజలుంటాయి. అవును అరటి పండులో గింజలంటే ఆశ్చర్యం అవసరం లేదు! ఈ రెండు రకాల చెట్లు పక్కపక్కనే పెరుగుతూ ఉంటే వాటి మధ్యన పరపరాగ సంపర్కం జరుగుతుంది. కొత్త పిలకలు పుడతాయి. పెరిగి పెద్దవయి రుచికరమయిన అరటి గెలలను ఇస్తాయి. కానీ ఈ అరటి నుంచి కొత్త రకాలు మాత్రం పుట్టవు. ఈ రుచికరమయిన, పసుపురంగుగల, వంపు తిరిగిన అరటి పండ్లను మానవులు పదివేల సంవత్సరాల క్రితమే గుర్తించారు. అంతేగాకుండా వాటి దుంపల ద్వారా వ్యప్తి చేయవచ్చునని కూడా అర్థం చేసుకున్నారు. వ్యాపించిన అరటి చెట్లేవీ పిలకలు వేయవు. ఆయినా వాటి సంఖ్య పెంచడానికి వీలు ఉంది. అలా పంటలు కొనసాగుతూ ఉండగా, ఉండగా, అనుకోకుండా జరిగిన జన్యుమార్పుల కారణంగా ఈ నాటి అరటి జాతులు పుట్టుకు వచ్చాయి. అరబ్బు వారు వీటిని ఆఫ్రికాకు అందించారు. స్పానిష్ దండయాత్ర దారులు అమెరికా ఖండానికి అందించారు.
ప్రస్తుతం ప్రపంచంలో లెక్కలేనన్ని రకాల అరటి చెట్లున్నాయి. ఈ రకాలను కల్పివార్స్ అంటారు. కావెండిష్ అనే రకం అరటి యూరపు, అమెరికాల్లో ఎక్కువగా కనబడుతుంది. ఈ జాతిని ఉష్ణమండల ప్రాంతాలలో కూడా పండించి ఎగుమతి చేస్తున్నారు. ఇక ఆఫ్రికా, మన దేశంతో సహా ఆసియాలలో ఎన్నో రకాల అరటి చెట్లు ఉన్నాయి. చూడటానికి, రుచిలో వీటి మధ్య ఎన్నో తేడాలున్నాయి. అయినా ఇవన్నీ ఒకప్పటి మూసా నుంచి వచ్చినవే. ఇవేవీ మనిషి ప్రమేయం లేకుండా, వాటంతట అవే పెరిగే రకాలు కావు. వీటి సంఖ్య పెరగాలంటే దుంపలు, వేళ్లను వాడవలసిందే.
ఈ రకంగా అరటి మొక్కలను అవసరమయిన సంఖ్యలో పెంచడం సులభంగాదు. అందుకే టిష్యూకల్చర్ పద్ధతిలో మొక్కలు పెంచడం మొదలయిన వెంటనే, వారందరి చూపు మొదట అరటి చెట్లమీద పడింది.
ఈలోగా మరొక విషయం. అరటి వ్యాప్తికి అడ్డుగా రాసాగింది అరటికి చీడపీడలు. రోగాల దాడి ఎక్కువ. ‘చీటేవాలా’ జాతికి ఒక వైరసు సోకింది. దాని కారణంగా సరిగ్గా గెలవేసే సమయానికి చెట్టు నిలువునా చీలిపోవడం మొదలయింది. ఆ రకం అంతమయిపోయింది. అరటి చెట్లలో రోగ నిరోధకత తక్కువగా ఉండి అవి వ్యాధులకు సులభంగా గురికావడానికి కారణం ఆ జాతులన్నీ ఒకే రకం నుంచి రావడమే. అన్నీ జన్యుపరంగా ఒకే రకంగా ఉండడంతో రోగాలు వాటిలో సులభంగా వ్యాప్తి చెందుతాయి. ‘చీటేవాలా’ లాంటి స్థానిక రకాలు కూడా ఈ రకంగానే నాశనమవుతున్నాయి. ఇది ప్రపంచమంతటా జరుగుతున్నది.
ఈ రకంగా చూస్తే కొన్నాళ్లకు ప్రపంచంలో అరటిపళ్లు ఉండవేమోనన్న భయం పరిశోధకుల్లో కనబడుతున్నది.
ఇరవయ్యవ శతాబ్దం మధ్య కాలం దాకా గ్రాస్ మిచెల్ అనే కల్పివార్ అరటి అభివృద్ధి చెందిన దేశాలలో బాగా పండింది. పండు త్వరగా పాడవదు గనుక ఎగుమతికి కూడా ఆ రకం అనువుగా ఉండేది. కానీ పనామా అనే రోగం కారణంగా ఈ రకం అంతమయింది. 1950 తర్వాత వియత్నాం వారి కావెండిష్ రకం మళ్లీ బలం పుంజుకున్నది. కానీ ఈ రకాన్ని పెంచడానికి, నిలువకూ, మగ్గపెట్టడానికీ వాడవలసిన పద్ధతులన్నీ కొత్త అయినా అంతకు ముందున్న ‘బిగ్‌మైక్’ రకం పోయింది. 1960 నుంచి కావెండిష్ రాజ్యం మొదలయింది. ఇది రుచిలో, అంతకు ముందు రకాలకు ఏరకంగానూ పోలదు అంటారు పాతరకాలను ఎరిగిన వారు. 1992 నుంచి ఈ రకానికి కూడా మళ్లీ ‘పనామా’ తాకిడి మొదలయింది. దీనమీద పురగు మందులేవీ పనిచేయడం లేదు. ఆసియాలో విస్తరిస్తున్న ఈ వ్యాధి ఇంకా లాటిన్ అమెరికాకు చేరలేదంటున్నారు. ‘అందుకు కాలం మాత్రమే అడ్డు’ అని కూడా వాళ్లే అంటున్నారు.
అరటి లేకుండా కాకూడదంటే ఆ రకంలో విత్తులు పుట్టించాలి. అందుకు అయ్యే శ్రమ అంతా ఇంతా కాదు. మనిషి పూనుకుని పరపరాగ సంపర్కం చేయించాలి. మూడు వందల పళ్లలో నుంచి ఒక దాంట్లో మాత్రమే విత్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విత్తుల్లో మూడవవంతులో మాత్రమే సరైన జన్యులక్షణాలుంటాయి.
టన్నులకొద్దీ పళ్లను గుజ్జు చేసి అందులో గింజలను వెదకడం ఎలాగుంటుందో ఊహించండి.
హోండూరాస్ లాంటి దేశాలలో ఈ పని జరుగుతూనే ఉంది. బజార్లో కొత్తరకం అరటిపళ్లు కనిపించినా, అసలే రకమూ కనిపించక పోయినా ఆశ్చర్యం అవసరం లేదేమో?


పురుగులను తింటే పోలే?

1885లోనే విన్సెంట్ హాల్ట్ అనే బ్రిటిష్ కీటక శాస్తజ్ఞ్రుడు ‘పురుగులను తింటే సరి!’ అని అర్థం వచ్చే పేరుతో ఒక పుస్తకం రాశాడు. మంచి ఆలోచనే. పైగా ప్రపంచంలో మన దేశంతో సహా చాలా దేశాలలో పురుగులను మహా ఇష్టంగా తింటారు. వానకాలంలో పుట్టుల దగ్గర దీపం పెట్టి, దానిమీద చిల్లుల కుండ బోర్లించి, అందులో దూరి రెక్కలు పోగొట్టుకున్న ఉసిళ్లను తినడం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతాలలో పురుగులు పెద్దవిగా ఉంటాయి. అవి ఒకేచోట పెద్ద సంఖ్యలో దొరుకుతాయి. వాటిని పట్టడం సులభం. పడమటి దేశాల వారు మాత్రం ఇక్కడి వాళ్లు తిండికి గతిలేక పురుగులను తింటారని అనుకుంటారు. అది కేవలం అపోహ. పురుగులను తినేవారు వాటిని అరుదుగా దొరికే రుచి కోసం మాత్రమే తింటారు.
పురుగులు ఏ ఇతర మాంసానికీ తీసిపోవు. వాటిలో రకాలను బట్టి 30 నుంచి 70 శాతం దాకా ప్రొటీనులుంటాయి. ఎసెన్షియల్ ఫాటీ ఆసిడ్‌లు, బి విటిమన్ కూడా వాటిలో పుష్కలంగా ఉంటుంది. అయిరన్, జింక్ లాంటి ఖనిజాలు ఉంటాయి. పురుగుల శరీరం మీద కైటిన్ అనే ప్రొటీన్‌తో తయారయిన పెంకు ఉంటుంది. అది శరీరం బరువులో పదిశాతం కన్నా ఎక్కువ మాత్రం ఉండదు. ఆశ్చర్యమేమిటంటే ఈ పెంకును కూడా కొంతవరకు అరిగించగల ఎంజైములు మనిషి కడుపులో సిద్ధంగా ఉంటాయి.
1970తో పోలిస్తే ప్రపంచంలో మాంసాహారం వాడకం మూడింతలయింది. 2050 నాటికి వాడకం నేటి స్థాయికి రెండింతలవుతుంది. కానీ, అంతగా జంతువులను పెంచడంలో మాత్రం ఎన్నో చిక్కులున్నాయి. వాటికి తగినంత చోటు, మేత దొరకాలి. అంతకన్నా ముందు, వాటికి రోగాలు రాకుండా చూడగలగాలి. నెమరువేసే జంతువుల నుంచి వచ్చే మీతేన్ వాయువు కాలుష్యాన్ని పెంచుతుంది. ఈ మీతేన్ సమస్య కీటకాలతో ఉండదన్నది మరొక ఆశ్చర్యకరమయిన విషయం.
ఆహారం కోసం మిగతా జంతువులను పెంచడం కన్నా పురుగులను పెంచడంలో కొన్ని వెసలుబాట్లున్నాయి. పురుగుల శరీరంలో వేడిమి ఉండదు. అంటే అవి తిన్న తిండిని, ఈ వేడిని నిలబెట్టుకునే పేరున ఖర్చు చేయనవసరం లేదు. తిన్న తిండి, ఆ రకంగా ఎక్కువ శాతంగా బాడీమాస్‌లోకి (మాంసం) మారుతుంది. ఒక కిలో గ్రాము మాంసం సిద్ధం కావడానికి మిడతజాతి పురుగులకు 1.7కిలోల తిండి అవసరం. అదే ఒక కోడికి 2.2, పందికి 3.6, గొర్రెకు 6.3 కిలోల ఆహారం అవసరం.
పురుగుల శరీరంలో ఆహారంగా ఉపకరించే భాగం 80 శాతం దాకా ఉంటే, పందిలో అది 70 శాతం మత్రమే. కోడిలో ఈ శాతం 65, మేక, గొర్రెల్లో 35 మాత్రమే. మేక, గొర్రెల చర్మం మరోరకంగా ఉపయోగపడుతుందన్నది మరో సంగతి!
తేనెటీగలను తేనె కోసం, పట్టు పురుగులను పట్టుకోసం పెంచుతూనే ఉన్నారు. వాటిని ఆహారంగా కూడా వాడుకోవచ్చు. ఈత, తాడి, జాతి చెట్ల బోదెల్లో ఒక రకమయిన పురుగులు పెరుగుతుంటాయి. ఉష్ణమండల ప్రాంత దేశాలలో కొన్నిచోట్ల ఈ పురుగులను చాలా ఇష్టంగా తింటారు. ఎక్కడో పెరిగిన పురుగులను ఏరుకుని తేవడం కష్టమే. వాటిని పెంచుకోవడం సులభం. థాయ్‌లాండ్ లాంటి దేశాలలో చాలా కుటుంబాల వారు క్రికెట్ పురుగులను ఇళ్లలోనే పెంచుకుంటారు. నెథర్లాండ్స్‌లో 2008 నుంచి పురుగులను పెంచడం ఒక పరిశ్రమగా మారింది.
మన దేశంలోనే కాదు, మరెక్కడయినా మనుషులకు ఒక్కసారిగా కొత్తరకం తిండి తినడానికి మనసు ఒప్పుకోదు. ‘కప్పలు, పాములు తింటారట!’ అని వింతగా చెప్పుకోవడం మనకు తెలిసిందే. తిని బాగుందన్న తర్వాత కూడా ఆ తిన్నదేమిటో చెపితే వాంతి చేసుకునే మనస్థత్వం మనిషిది. అందుకే పురుగుల నుంచి ప్రొటీనులను తీసి తెలియకుండా తినిపించడం మంచిదంటున్నారు.


మృతసముద్రం అంటే ఏమిటి?
 November 7th, 2010

ఈ ప్రపంచంలో ఎక్కువ భాగం నీరే ఉంది. కొంత మేర మాత్రమే భూఖండాలున్నాయి. ఈ ఖండాలలో కూడా కొన్ని పెద్ద జలాశయాలున్నాయి. వాటిని కూడా సముద్రాలు అనే అంటున్నారు.



ఈ రకం జలాశయాలు లేదా సరస్సుల్లో మృత సముద్రం కూడా ఒకటి. అయితే ఇది మామూలు జలాశయం కాదు. చాలా విచిత్రమయినది. ఇందులో జీవులు లేవు. చేపలను తెచ్చి ఆ నీటిలో వదిలినా వెంటనే చనిపోతాయి. అందుకే అది ‘మృత సముద్రం!’ (డెడ్ సీ)
ఈ మృత సముద్రం ఆసియా నైరుతి భాగంలో, ఇజ్రాయెల్, జోర్డన్ దేశాల దగ్గర ఉండే ఒక ఉప్పునీటి సరస్సు.

మొట్టమొదటి విచిత్రం దీని నీటిమట్టం. ప్రపంచమంతటా జలాశయాలన్నీ సముద్రమట్టానికి సమానంగా, లేదా ఎత్తున ఉంటే, మృత సముద్రంలో మాత్రం నీటిమట్టం, సముద్రమట్టానికి 400 మీటర్లు తక్కువగా ఉంటుంది. పైగా అది రానురాను తగ్గుతున్నది కూడా! ఈ సరస్సు పొడవు 80 కిలోమీటర్లు. అత్యధిక వెడల్పు 18 కిలో మీటర్లు. అంటే వైశాల్యం వెయ్యి చదరపు కిలోమీటర్లకన్నా ఎక్కువ!

మృత సముద్రంలోకి నీరు ముఖ్యంగా జోర్డన్ నది ద్వారా వస్తుంది. అది ఉత్తర వేపున వచ్చి కలుస్తుంది. తూర్పు దిక్కున మరికొన్ని చిన్నచిన్న ప్రవాహాలు కూడా ఇందులోకి నీటిని మోసుకొస్తుంటాయి. ఇందులోంచి నీరు బయటకు పోయే మార్గం మాత్రం ఏదీ లేదు. ఎడారి కాబట్టి బాగా వేడి ఉండి, నీరు పెద్ద ఎత్తున ఆవిరయి పోతూ ఉంటుంది. జోర్డన్ నదిమీద వ్యవసాయం పేరున, ఆనకట్టులు కట్టి నీటిని మళ్లిస్తున్నారు. అందుకనే గత యాభయి సంవత్సరాలుగా మృత సముద్రంలో నీటి మట్టం తగ్గుతున్నది.

ఇక్కడ మరో విచిత్రం. మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. మృత సముద్రం నీటిమీద మనిషి పడుకుంటే పడవలాగ తేలుతూనే ఉంటాడు. ఇందుకు కారణం ఈ నీటిలో ఉప్పు మరీ ఎక్కువగా ఉండడం. బయటి సముద్రాలకన్నా ఇక్కడి నీరు ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

300 మీటర్ల లోతుకు పోతే ఉప్పు అంతా పేరుకుని ఘన రూపంలోనే ఉంటుంది. మామూలు ఉప్పుతోబాటు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియంల క్లోరైడులు, మెగ్నేషియం బ్రోమైడ్ మరెన్నో లవణాలు ఇక్కడ ఊరికే దొరుకుతాయి. అందుకే ఈ నీటిలో జీవులు లేవు. ఉప్పను తట్టుకునే కొన్ని రకాల సూక్ష్మ జీవులు మాత్రం ఈ నీటిలో ఉన్నాయని గుర్తించారు.

ఖర్చు లేకుండా లవణాలను అందిస్తుందని అక్కడి దేశాల వారికి సముద్రం మీద వల్లమాలిన ప్రేమ!
తిండి - పిండి .. కూరగాయలు!.
 November 7th, 2010

మనిషి వంట చేయడం ఎప్పుడు మొదలు పెట్టాడు అన్నది పెద్ద ప్రశ్న. అదేమో గానీ, పాతరాతి యుగంనాడు మనిషి వాడుకున్న వంట సామానులు ఈ మధ్యే పరిశోధకుల కంటబడ్డాయి. కనీసం ముప్పయివేల సంవత్సరాలకు ముందే మనిషి ధాన్యాలను నూరి పిండి తయారు చేసుకున్నాడని, కూరలను కూడా వండటానికి అనువుగా సిద్ధం చేసుకున్నాడని, ఈ పరికరాలు సూచిస్తున్నాయి.
ఈ రకమయిన పరికరాలు, ఇంతకన్నా పాతకాలానికి మునుపెన్నడూ దొరకలేదు. మానవుడు, ఆదిమ మానవుడి నుంచి, ఆధునిక మానవునిగా మారుతున్న సమయంలోనే బహుశః నియాండర్‌తర్ నుంచే మొదలుపెట్టి, ఆహారంలో, మనమనుకున్నకన్నా ఎక్కువగానే, వృక్ష సంబంధ పదార్థాలను చేర్చుకున్నట్లు పరిశోధనల్లో సూచనలందాయి.
గుహలలో బతికిన ఈ మానవులకు వంట గురించి, రుచిగల తిండి గురించీ బాగా తెలుసు. ఆరోగ్యకరమయిన తిండి గురించి కూడా బహుశః తెలుసేమో? ‘వేటాడడం, లేదా తిరిగి తిండిని సేకరించడం లాంటి పనులకు మంచి చురుకుదనం అవసరం. వండిన తిండి సులభంగా అరుగుతుంది. పైగా పిండి పదార్థాలను ముడిగాకన్నా వండి తింటే రుచి ఎక్కువ’ అంటారు పరిశోధకులు అనా రెవెడిన్.
‘పిండి చేసి, దాన్ని వండుకు తినడం ద్వారా అప్పటి మానవులకు, మంచి శక్తినిచ్చే ఆహారం అందుబాటులోకి వచ్చింది’ అంటారు ఈ మానవ చరిత్ర పరిశోధకురాలు. వీరి పరిశోధనల్లో భాగం ఇటీలీ, రష్యా, చెక్ ప్రాంతాలలో అనే్షణలు జరిపారు. ఈ ప్రాంతాలలో ఆధునిక మానవులు, నియాండర్‌తర్ మానవులు ఉండే వారన్న విషయం ముందే తెలుసు. ఇక్కడ దొరికిన రుబ్బురాళ్ల వంటి రాళ్లల్లో రకరకాల అడవి మొక్కలు, గింజల అవశేషాలు, అంటుకుని ఉండడం అసలు విశేషం. ‘వీళ్లు బహుశః పిండి కలిపి వేడి రాళ్లమీద రొట్టెలు చేసుకున్నారేమో’ అంటారు పరిశోధకులు. దొరికిన మొక్కలు, గింజల రకాలన్నింటిలోనూ పిండిపదార్థం (స్టార్చ్) ఎక్కువగా ఉన్నట్లు కూడా వీరు గమనించారు.
తామున్న పరిసరాల్లో దొరికే మొక్కలు, ధాన్యాలను వీరు ఎంచుకున్నారు. అవి పండించడానికి సరిపడేవి కావు గనుక, ఆ రకాలను ఇప్పుడెవరూ తినడం లేదు. అలనాటి మానవులు, చాలా ప్రయోగాలు, అనుభవాల మీదనే తినదగిన రకాలను ఎంచుకుని ఉంటారు.


రోబో రొమాన్స్.

November 7th, 2010

1. రోబోటా అనే చెక్ మాటకు ‘విసుగు పుట్టించే పని’ అని అర్థం. అలాంటి పనులు
చేయడానికి తయారయిన యంత్రాలే రోబోలు.
2. ప్లేటో సహచరుడు ‘ఆర్కయిటాస్ ఆఫ్ హాలెండకు క్రీ.పూ. అయిదవ శతాబ్దిలో ఒక
మెకానికల్ పక్షిని తయారు చేశాడు. అది బహుశః మొదటి రోబోట్ కావచ్చు!
3. స్పిరిట్, ఆపర్చునిటీ అనే పేర్లుగల రెండు రొబోట్‌లు అంగారక గ్రహం మీద మూడేళ్లపాటు
తిరిగాయి. వాటిని తయారు చేసినప్పుడు మూడు నెలలు పనిచేస్తే చాలనుకున్నారు.
4. ఎంఐటి మీడియా వ్యాబ్ వాళ్లు రోకో అనే పర్సనల్ రోబోను తయారు చేస్తున్నారు. ఇదొక
కంప్యూటర్! కానీ ఇందులో మానిటర్‌కు బదులు తల, మెడ ఉంటాయి.
5. స్టార్‌వార్స్ క్రమంలో వచ్చిన ఆరు సినిమాల్లోనూ ఆర్-2, డి-2 అనే మరమనిషి పాత్ర ఉంది.
ఆ రోబోలో వయసువల్ల వచ్చే మార్పులేవీ లేనట్లు చూపించారు.
6. రోబోటెక్స్ నిపుణుడు హైనిక్ క్రిస్టెనె్సన్ ఒక చిత్రమయినా మాట చెపుతున్నాడు. మరో
నాలుగయిదేళ్లల్లో మనుషులకు లైంగిక భాగస్వాములు కాగల రోజులు వస్తాయట!
7. కార్నెజీ మెల్టన్ రొబోటిక్స్ సంస్థ పరిశోధకులు హాన్స్ మోరాలేక్ గారి అభిప్రాయంతో 2040 నాటికి, మానవ సమాజాన్ని అన్నిరకాలుగా నడిపించగల మరమనుషులు
వస్తారట!

No comments: